Monday 23 February 2015

ఫేస్‌బుక్ కలిపింది ఇద్దరినీ

మెల్‌బోర్న్: దక్షిణాఫ్రికాపై అద్భుతమైన ఇన్నిం గ్స్ ఆడి భారత జట్టు విజయానికి కారణమైన శిఖర్ ధావన్... తిరిగి ఫామ్‌లోకి రావడంతో ఊర ట చెందానన్నాడు. గత 3 నెలలు తాను గడ్డుకాలం ఎదుర్కొన్న సమయంలో అండగా నిలిచిన వారికి కృతజ్ఞతలు తెలిపిన శిఖర్ ఇంటర్వ్యూ...

దక్షిణాఫ్రికాపై సెంచరీ ఎంత ప్రత్యేకం?
 ప్రపంచకప్‌లో తొలి సెంచరీ సాధించడం చాలా ఆనందంగా ఉంది. ఈ సెంచరీ దక్షిణాఫ్రికాపై గెలవడానికి ఉపయోగపడటం ఇంకా సంతోషంగా ఉంది. బలమైన బౌలింగ్ లైనప్ ఉన్న పెద్ద జట్టుపై గెలవడం, పరుగులు చేయడం ఎప్పుడైనా సంతృప్తినిస్తుంది.

టోర్నీకి ముందు గడ్డు కాలం ఎదుర్కొన్నారు. ఇప్పుడు ఈ పరుగులను ఎలా చూస్తున్నారు?
ఫామ్‌లోకి వచ్చినందుకు సంతోషంగా ఉంది. గత మూడు నెలలుగా ఈ క్షణాల కోసం ఎదురుచూస్తున్నాను. భగవంతుడితో పాటు జట్టు సహా య సిబ్బంది, కెప్టెన్, సహచరులందరికీ థాంక్స్ చెప్పాలి. నేను విఫలమైనా కూడా నా సామర్థ్యాన్ని నమ్మి నాకు అండగా నిలిచారు.

మళ్లీ ఫామ్‌లోకి రావడం కోసం ఏం చేశారు?
వీలైనంత వరకు నా పని నేను చేసే ప్రయత్నం చేశాను. పరుగులు రావడం లేదని భయపడలేదు. ఎందుకంటే చెడ్డ రోజుల వెంటే మంచి రోజులు వస్తాయని నాకు తెలుసు. అలాంటి సమయంలో మానసికంగా ధృడంగా ఉండటం ముఖ్యం. నేను బాగా ఆడటం లేదని ఈ మూడు నెలలో ఎప్పుడూ అనుకోలేదు. ఫామ్ కోల్పోయి పెద్ద స్కోర్లు చేయలేదంతే. ప్రపంచకప్ సమయానికి ఫామ్‌ని అందుకోవడం ఊరటనిచ్చింది.

బలమైన దక్షిణాఫ్రికా బౌలింగ్ లైనప్‌ను ఎదుర్కోవడానికి ఏం చేశారు?
వాళ్ల పేసర్లు ఎంత అనుభవజ్ఞులో అందరికీ తెలుసు. ఆరంభంలో వికెట్ ఇవ్వకుండా ఉంటే భారీ స్కోరు చేయొచ్చనేది మా నమ్మకం. ఓపికగా ఆడుతూ మంచి భాగస్వామ్యాలు నెలకొల్పాలనే లక్ష్యంతో ఆడాం. నిలబడితే రన్‌రేట్ పెంచొచ్చని తెలుసు.

ఇన్నింగ్స్‌లో ఏ దశలో అయినా బ్యాటింగ్ చేయడం కష్టంగా అనిపించిందా?
పిచ్ రెండు రకాలుగా ఉంది. కొన్ని బౌన్సర్లు వేగంగా వస్తే... కొన్ని ఆగి వచ్చాయి. బంతిని బట్టి, నా బలం ఆధారంగా షాట్లు ఆడాలని నిర్ణయించుకున్నాను. ఒకట్రెండు సందర్భాల్లో కొన్ని బంతులు ఇబ్బంది పెట్టినా... తర్వాతి బంతి సమయానికి మళ్లీ ఏకాగ్రతను తెచ్చుకోగలిగాను.

చాంపియన్స్ ట్రోఫీలో, ప్రపంచకప్‌లో దక్షిణాఫ్రికాపై చేసిన సెంచరీల్లో ఏది మంచి ఇన్నింగ్స్?
ప్రపంచకప్ సెంచరీయే రెండింటిలోకి ఉత్తమం. ఈసారి నేను చాలా సమయస్ఫూర్తితో ఆడాను. చాంపియన్స్ ట్రోఫీకి ఇప్పటికీ నాలో పరిణతి పెరిగింది. ఇప్పుడు ఆటను మరింత అర్థం చేసుకున్నాను. ఇక్కడి నుంచి నా ఆటను మరింత మెరుగుపరుచుకుంటాను.

మెల్‌బోర్న్‌లో 90 వేల మంది ప్రేక్షకుల మధ్య ఆడటం ఎలా ఉంది?

మనకు ఇంతమంది మద్దతుదారులు ఉంటారని అనుకోలేదు. స్టేడియంలో మెజారిటీ అభిమానులు మద్దతు ఇవ్వడం సంతోషంగా ఉంది. మేం ఎక్కడ ఆడినా వాళ్లు చూపించే అభిమానం అమూల్యం. వారివల్లే మేం ఈరోజు ఈ స్థితిలో ఉన్నాం. కాబట్టి అభిమానులందరికీ కృతజ్ఞతలు.

ఫేస్‌బుక్ కలిపింది ఇద్దరినీ...
కాకతాళీయమే అయినా చాలామంది క్రీడాకారులు తమ అత్తగారి నగరాల్లో జరిగే మ్యాచ్‌ల్లో రాణిస్తుంటారు. తాజాగా మెల్‌బోర్న్‌లో శిఖర్ ధావన్ సెంచరీతో అదరగొట్టాడు. దీంతో మరోసారి శిఖర్ స్టోరీ అభిమానుల్లో చర్చకు వచ్చింది. ఈ స్టార్ ఓపెనర్ భార్య ఆయేషాది మెల్‌బోర్న్. ఈమె తల్లిది బెంగాల్ కావడంతో భారత్‌తో సంబంధాలు ఉన్నాయి. 2008లో శిఖర్ ధావన్ తన ఫేస్‌బుక్ పేజీలో ఆయేషాను చూశాడు.

ఆమె హర్భజన్ ఫ్రెండ్స్ లిస్ట్‌లో ఉంది. దీంతో శిఖర్ ‘ఫ్రెండ్ రిక్వెస్ట్’ పంపించాడు. అక్కడ ఈ ఇద్దరికి పరిచయం మొదలై అది ప్రేమగా మారింది. ఆయేషా... 29 ఏళ్ల శిఖర్ కంటే పదేళ్లు పెద్దది. ఇద్దరు పిల్లలతల్లి. అయినా ఈ ఇద్దరూ 2012 లో పెళ్లి చేసుకున్నారు. తర్వాత వీళ్లకి ఓ అబ్బాయి పుట్టాడు. ఆ పిల్లాడి పేరు జొరావర్ ధావన్. అన్నట్లు ధావన్ దంపతులిద్దరికీ టాటూలంటే పిచ్చి. శిఖర్ మణికట్టు మీద ఆయేషా పేరుతో టాటూ ఉంటుంది.

No comments:

Post a Comment